ఎమ్మార్వో లావణ్య అరెస్ట్‌

11 Jul, 2019 13:22 IST|Sakshi

 సాక్షి, రంగారెడ్డి : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశంపేట ఎమ్మార్వో లావణ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. గురువారం సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నారు. కాగా లావణ్య అరెస్ట్‌ విషయం తెలుసుకున్న ఆమె భర్త వెంకటేష్‌ పరారయ్యారు. అడ్మినిస్ట్రేట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న వెంకటేష్‌ ఏసీబీ అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు.

బుధవారం ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందర్గు వీఆర్‌ఓ అనంతయ్య ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెట్‌గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అనంతయ్య వెనకాల ఎమ్మార్వో లావణ్య పాత్ర ఉందని ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. హిమాయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ. 93.5లక్షల నగదు, 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడంతో ఏసీబీ అధికారులు లావణ్యను అరెస్ట్‌ చేశారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ తహశీల్దార్ అవార్డు అందుకున్న లావణ్య.. ఇప్పుడు అవినీతి కేసులో అరెస్ట్‌ కావడం గమనార్హం. 

మరిన్ని వార్తలు