జూన్‌లో చేరి.. సెప్టెంబర్‌లో ఉరేసుకుని!

24 Sep, 2017 12:13 IST|Sakshi

సాక్షి, కోజికోడ్ : ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎంటెక్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదం కేరళలోని కోజికోడ్‌లో శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ క్రిష్ణ (23) ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. కోజికోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిస్టూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో నానో టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ చదువుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో కోజికోడ్ నిట్‌లో చేరిన అరుణ్ హాస్టల్లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో తన రూమ్‌మేట్ ఇంటికి వెళ్లిపోవడంతో గత కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం ఉదయం ఓ విద్యార్థి అరుణ్ రూమ్ తలుపుతట్టగా ఎలాంటి స్పందనరాలేదు. ఎంతసేపు పిలిచిన అలికిడి లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. అరుణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అతడ్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అదివరకే ఆ విద్యార్థి చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కోజికోడ్ నిట్‌లో, అరుణ్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎలాంటి సూసైడ్ లేఖ లభ్యం కాలేదని సమాచారం. 

మరిన్ని వార్తలు