అగ్నిప్రమాదంలో మరణించిన బాలిక

14 May, 2019 14:53 IST|Sakshi

ముంబై : కూతురు బుద్ధిగా ఇంట్లోనే కూర్చుని బాగా చదువుకోవాలని భావించిన తల్లిదండ్రులు బయట నుంచి తలుపు గడియపెట్టి తాళం వేసి వెళ్లారు. పాపం అప్పుడు వారికి తెలియదు.. తాము చేసిన పని వల్ల తమ కూతురు అగ్నికి ఆహుతి అవుతుందని. ఈ విషాదకర సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. శ్రావణి చవాన్‌(16) అనే బాలిక తన తల్లిదండ్రులతో కలిసి.. ముంబై దాదర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా ఆదివారం శ్రావణి తల్లిదండ్రులు ఓ పెళ్లికి వెళ్లారు. చదువుకుంటుందనే ఉద్దేశంతో శ్రావణిని ఇంట్లోనే ఉంచి బయట నుంచి గడియ పెట్టి తాళం వేసి వెళ్లారు.

మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో శ్రావణి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడవ అంతస్తులో చెలరేగిన మంటలు.. శ్రావణి ఇల్లు ఉన్న ఐదో అంతస్తు వరకూ వ్యాపించాయి. శ్రావణిని ఇంట్లో పెట్టి తాళం వేయడంతో పాపం తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో మంటల్లో కాలిపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయలైన శ్రావణిని.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు