భార్యల మార్పిడి కేసులో వ్యాపారవేత్త అరెస్టు

19 Dec, 2019 14:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తమ లైంగికానందం కోసం బలవంతంగా భార్యలను మార్పిడి చేసుకుంటున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఓ మహిళ తన భర్తతోపాటు, మరో ముగ్గురిపై ఫిర్యాదు చేసింది. వ్యాపారవేత్త అయిన భర్త తనను అక్రమ లైంగిక సంబంధంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలోని సమతానగర్‌ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని బుధవారం ఆ వ్యాపారవేత్త(46)ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి డిసెంబర్ 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది.
 
కాగా భర్త తన వికృత కోర్కెను భార్య  ముందు ఉంచగా, అందుకు ఆమె అంగీకరించలేదు. తనకు ఇలాంటి వ్యవహారంలో పాల్గొనడం ఇష్టం లేదని భార్య స్పష్టం చేసింది. అయితే ఆమెను బెదిరించి, భయపెట్టి బలవంతంగా పర పురుషుడి వద్దకు పంపాడు. అయితే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడిన భర్త.. భార్య మార్పిడిలో పాల్గొన్నప్పుడు రహస్యంగా వీడియో తీశాడు. అప్పటినుంచి ఈ దారుణం గురించి ఎవరికీ చెప్పకుండా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అయితే భర్త చేష్టలతో విసిగిపోయినా బాధితురాలు అతడి నుంచి దూరంగా వెళ్లి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. ఈ విషయమంతా తల్లిదండ్రులకు చెప్పడంతో భార్య మార్పిడికి సహకరించే ఇతర జంటలను తన భర్త ఎలా కలుసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. అతను తన వాట్సాప్ గ్రూప్.. సోషల్ మీడియా ద్వారా ఇతర జంటలతో మాట్లాడి దీనికి పాల్పడుతున్నట్లు తెలిసిందని వెల్లడైంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్తతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు