‘అతని ఆత్మ నన్ను పిలుస్తుంది.. అందుకే’

16 Oct, 2018 16:11 IST|Sakshi
ఆత్యహత్చ చేసుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థి సౌరభ్ (ఫైల్‌ఫోటో)

ముంబై : నిన్ననే మన దగ్గర ఆత్మలకు సంబంధించి ఓ వార్త బాగా ప్రాచుర్యం చెందింది. కొన్ని రోజుల క్రితం మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్‌ ఆత్మ తమకు కనిపిస్తుందని.. విగ్రహం కట్టమని అడుగుతుందంటూ ఓ జంట ప్రణయ్‌ భార్య అమృతను కలిసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ కుర్రాడి ఆత్మ తనను పిలుస్తుందని చెప్పి పద్దేనిమిదేళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాలు.. నాగ్‌పూర్‌కు చెందిన సౌరభ్‌(18) ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. ఆ రోజు నుంచి సౌరభ్‌ ఆ బాలుని ఆత్మను తనకు కనిపిస్తుందని.. అది తనను రమ్మని పిలుస్తుందని భావించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పాడు. కానీ సౌరభ్‌ చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు మైనర్‌లు చనిపోయారు. దీనికి కూడా సదరు బాలుని ఆత్మనే కారణమని భావించాడు సౌరభ్‌. తనను తీసుకెళ్లడానికే ఆ బాలుని ఆత్మ ప్రయత్నిస్తుందని.. ఈ ‍క్రమంలోనే ఆ ఇద్దరు మైనర్‌లు చనిపోయారని భావించాడు. దాంతో తాను చనిపోకపోతే ఆ బాలుని ఆత్మ మరింత మందిని చంపుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

‘రెండు నెలల క్రితం నా కళ్ల ముందే రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అతని ఆత్మ నన్ను పిలుస్తోంది. నేను రాకపోవడంతో ఇద్దరు చనిపోయారు. నేను వెళ్లకపోతే మరింత మంది చనిపోతారు. అందుకే నేను చనిపోతున్నానం’టూ సౌరభ్‌ సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి ‘సౌరభ్‌ చాలా తెలివిగల విద్యార్థి. చదువులో ఎప్పుడు ముందుండేవాడని తెలిసింది. కానీ రోడ్డు ప్రమాదంలో తన కళ్ల ముందే ఓ వ్యక్తి చని పోవడం అతన్ని ఎంతో బాధించింది. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పాడు. కానీ అతను చెప్పిన విషయాల గురించి కుటుంబ సభ్యులు సీరియస్‌గా తీసుకోలేదు. బాలుని ఆత్మ పిలుస్తుందనే భయం వల్లే సౌరభ్‌ ఆత్మహత్య చేసుకున్నాడ’ని పోలీస్‌ అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు