కదులుతున్న కారులో నరకం చూపారు..

11 Dec, 2019 15:30 IST|Sakshi

ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో వికృత ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో మూడుగంటల పాటు 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ పోస్ట్‌ చేసిన యువకుడిని లొకేషన్‌ ట్రేస్‌ చేయడం ద్వారా గుర్తించిన నిందితులు అతడిని కారులో తిప్పుతూ ఈ దారుణానికి తెగబడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై అసహజ శృంగారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ మైనర్‌ బాలుడు కూడా ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెంట్రల్‌ ముంబై శివార్లలో నివసించే 22 ఏళ్ల యువకుడు ఆదివారం నగరంలోని ఓ రెస్టారెంట్‌ వద్ద సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఈ పోస్ట్‌ను చూసిన నలుగురు అనుమానితులు బాధితుడి లొకేషన్‌ను ట్రేస్‌ చేసి తాము అతని ఫ్యాన్స్‌ అంటూ నమ్మబలికారు. తమతో పాటు బైక్‌ రైడ్‌కు రావాలని కోరగా బాధితుడు సమ్మతించి వారితో పాటు వెళ్లాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని ఓ హాటల్‌ దగ్గర ఆగిన వారు అక్కడి నుంచి కారులోకి బాధితుడిని బలవంతంగా ఎక్కించుకుని మూడు గంటల పాటు నగరంలో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు సోమవారం తెల్లవారుజామున బాధితుడిని రోడ్డుపై పడవేసి పారిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు