అద్దెకు పాస్‌పోర్టు.. మేకప్‌ వేసి దేశం దాటిస్తారు..!

16 Aug, 2018 13:46 IST|Sakshi

ఇప్పటివరకు 300 మంది బాలికలను అమెరికా తరలింపు

సాక్షి, ముంబై : బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పేద కుటుంబాలకు డబ్బు ఎరగా చూపి బాలికలను అమెరికాకు అమ్మేస్తున్నగుజరాత్‌కు చెందిన రాజుభాయ్‌ గమ్లేవాలా (50)ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఒక్కో బాలికకు 45 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్న నిందితుడు ఇప్పటి వరకు 300 మంది బాలికలను దేశం దాటించారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు 2007 నుంచి ఈ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వ్యభిచార కూపానికి తరలివెళ్లిన పిల్లలంతా 11 నుంచి 16 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు.

ఇలా దేశం దాటిస్తాడు..
‘పూట గడవని పేద కుటుంబాలకు డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేస్తాడు. కొంచెం అటుఇటూగా అదే పోలికలతో ఉండే వారి పాస్‌పోర్టులు అద్దె ప్రాతిపదికన తీసుకుంటాడు. పాస్‌పోర్టుపై ఉండే ఫోటోకు సరిపోయే విధంగా పిల్లలకు మేకప్‌ వేయిస్తాడు. అనంతరం దర్జాగా దేశం దాటిస్తాడు. బాలికలను విదేశాలకు తరలించాక తిరిగి ఇండియాకి పాస్‌పోర్టులు పంపిస్తాడు’ అని పోలీసులు వెల్లడించారు. ఇంత జరుగుతున్నా పాస్‌పోర్టు అధికారులకు ఏమాత్రం అనుమానం రాకపోవడం గమనా​ర్హం.

ఇలా దొరికిపోయాడు...
గత మార్చిలో గుజరాత్‌కు చెందిన నటి ప్రీతిసూద్‌ చొరవతో ఈ విషయం వెలుగుచూసింది. ఇద్దరు బాలికలను దేశం దాటించే క్రమంలో వారికి ఒక బ్యూటీ సెలూన్‌లో మేకప్‌ వేయించారు. అయితే, మేకప్‌ విషయంలో బాలికలతో పాటున్న కొందరు వ్యక్తులు అతిగా స్పందించారు. దాంతో సెలూన్‌ నిర్వాహకుడికి ఈ వ్యవహారంపై అనుమానం వచ్చింది. వెంటనే తన ఫ్రెండ్‌ ప్రీతికి విషయం చెప్పాడు. అక్కడికి చేరుకున్న ప్రీతి విషయం గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చింది. సెలూన్‌పై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తాజాగా.. అక్రమ రవాణా రాకెట్‌లో కీలక వ్యక్తి గమ్లేవాలాను సైతం అరెస్తు చేశారు. కాగా, అరెస్టయిన వారిలో ఒకరు ఎస్సై కొడుకు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు