వినియోగదారులుగా వచ్చి హత్యాయత్నం..

27 Dec, 2018 10:10 IST|Sakshi
పోలీసుల అదుపులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు

సొత్తు చోరీ.. నిందితుల అరెస్ట్‌

నాచారం:  బ్యూటీపార్లర్‌కు  వినియోగదారులుగా వచ్చి నిర్వాహకురాలిపై హత్యాయత్నం చేసి సొత్తు చోరీ చేసిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఈ  సంఘటన మల్కాజిగిరి సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజిగిరి సీసీఎస్‌ డీసీపీ నాగరాజు ఆధ్వర్యంలో నాచారంలోని సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫిల్‌గూడలోని వైల్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే బిట్రా విష్ణుప్రియ (25), మౌలాలి షఫీనగర్‌కు చెందిన ముత్తిరాజు మౌనిక (21) ఇద్దరు టైలర్‌ పనిచేస్తుంటారు.  దువ్వ వెంకటరత్నకుమారి (50)  వైల్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌లో తన నివాసంలో బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తుంటుంది. విష్ణుప్రియ తరచూ వెంకటరత్నకుమారి మేకప్‌ చేసుకోవడానికి వెళ్తుటుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న నగదు, బంగారం ఇతర వస్తువులను చూస్తూ ఉండేది.

అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న విష్ణుప్రియ ఒంటరిగా ఉన్న వెంకటరత్నకుమారి ఇంట్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుంది. విష్ణుప్రియ, మౌనిక ఇద్దరు కలిసి డిసెంబర్‌ 25 మధ్యాహ్నం 3 గంటల సమయంలో మేకప్‌ కోసం వెంకటరత్నకుమారి ఇంటికి వెళ్లారు. మౌనికకు మేకప్‌ చేసే సమయంలో విష్ణుప్రియ రోకలిబండతో వెంకటరత్నకుమారి తలపై గట్టిగా కొట్టింది. ఆమె కిందపడిపోగానే చార్జింగ్‌ వైర్‌తో గొంతుకు చుట్టి హత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి నోటి నుండి రక్తం రాగానే చనిపోయిందనుకొని ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, బంగారు గాజులు, ఐఫోన్, తీసుకొని పరారయ్యారు. కొంతసేపటి తర్వాత వెంకటరత్నకుమారి స్పృహలోకి వచ్చి తనపై జరిగిన దాడి గురించి నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు అందిన 24 గంటలలోపే నింధితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుండి రూ.1,56 లక్షల విలువ గల 18 తులాల బంగారం, ఒక ఐఫోన్‌లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును తొందరగా చేదించిన సీసీఎస్‌ మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య, కె.జగన్నాదరెడ్డి, పోలీసు బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి అడిషనల్‌ డీసీపీ క్రైం ఎస్‌కె.సలీమా, ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు