భార్యపై భర్త హత్యాయత్నం

21 Feb, 2020 11:33 IST|Sakshi
కాలువలో బాధితురాలు

దాడి చేసి కాలువలో పడేసిన వైనం

నిందితుడి అరెస్ట్‌  

కావలి: భార్యను దారుణంగా కొట్టి కాలువలో పడేశాడు భర్త. గురువారం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడికి తోడుగా ఉండి ప్రోత్సహించిన ఆడపడుచుపై పోలీసులు కేసు నమెదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కావలి çపట్టణానికి చెందిన షేక్‌ రమీజాకు కొండాపురం మండలం గరిమెనపెంట గ్రామానికి చెందిన షరీఫ్‌తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. వీరు కావలిలోని వెంగళరావునగర్‌లో నివాసం ఉంటున్నారు. బేల్దారి పనులు చేసే షరీఫ్‌ మద్యానికి బానిసైయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని హింసిస్తుండేవాడు. బుధవారం కూడా కొట్టడంతో ఆమె టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. షరీఫ్‌ను పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్‌ చేశారు. అనంతరం ఇద్దరూ ఇంటికి వెళ్లిపోయారు.

మళ్లీ చిత్తుగా మద్యం తాగి ఇంటికి చేరుకొన్న షరీఫ్‌ భార్యను కొట్టాడు. అక్కడే షరీఫ్‌ సోదరి కూడా ఉంది. ఆమె సోదరుడికి సహకరిస్తూ ప్రోత్సహించింది. ఈక్రమంలో రమీజా సొమ్మసిల్లి ఇంట్లోనే పడిపోయింది. షరీఫ్‌ ఆమె గొంతుపై కాలువేసి తొక్కాడు. ఇక చనిపోయిందనుకొని భావించి ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి  కాలువలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌ ద్వారా బాధితురాలిని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె నుంచి వివరాలు సేకరించిన పోలీసులు హత్యాయత్నానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో షరీఫ్, ఆడపడుచును అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు