మహిళపై హత్యాయత్నం

28 Jul, 2018 10:58 IST|Sakshi
కొత్తగూడెం ఆస్పత్రిలో వెంకటమ్మ 

ఇల్లెందుఅర్బన్‌ : మండలంలోని కరెంట్‌ ఆఫీస్‌ ఏరియాలో నివసిస్తున్న సింగరేణి కార్మికుడి భార్యపై గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. ఆమె కుమారుడు బయ్య శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు... కరెంట్‌ ఆఫీస్‌ ఏరియాలోని ఆల్‌మైటీ ఫంక్షన్‌ హాల్‌ ఎదుట నివసిస్తున్న సింగరేణి కార్మికుడు బయ్య ఆంజనేయులు, ఆయన భార్య వెంకటమ్మ కలిసి ఇంట్లోని రెండవ గదిలో నిద్రిస్తున్నారు.

ఆంజనేయులు తల్లి లచ్చమ్మ, ఇంట్లో మొదటి గదిలో నిద్రిస్తున్నారు. అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కొందరు దుండగులు ఇంటి తలుపులను తట్టడంతో వెంకటమ్మ తలుపులు తీశారు. దుండగులు వెంటనే ఆమె మెడను తాడుతో గట్టిగా బిగించి తీవ్రంగా కొట్టారు. ఆమె స్పృహ కోల్పోయి కింద పడడంతో పరారయ్యారు. కొద్దిసేపటి తరువాత ఆమె మేల్కొని, కుటుంబీకులకు సమాచారమిచ్చారు.

వెంటనే ఆమెను ఏరియా సింగరేణి వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అప్పుడు వచ్చే డబ్బుకు ఆయన రెండోభార్య కుటుంబీకులు ఆశపడ్డారు. అందుకే, ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు. శ్రీనివాస్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు