వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ వాయిదా

14 Dec, 2018 11:59 IST|Sakshi
హైదరాబాద్‌ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌కవర్‌లో పంపించిన నివేదికపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీల్డ్‌ కవర్‌ నివేదిక సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో మారు నివేదిక పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి(ఈ నెల 21 తేదీకి)  వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

 విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించిన సంగతి తెల్సిందే.ఈ ఘటన ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయినా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో పంపిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తి స్థాయి నివేదిక పంపాలని ఆదేశించింది.

ఈ కేసులో వైఎస్‌ జగన్‌ తరపున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పంపిన సీల్డ్‌ కవర్‌ నివేదిక విషయంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ నెల 21లోగా మళ్లీ నివేదిక ఇవ్వాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశించదని వెల్లడించారు. శుక్రవారం లోగా కేసును ఎన్‌ఐఏకు మీరు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు