ప్రేమ కోసం స్నేహితులే శత్రువులయ్యారు

6 Oct, 2018 09:34 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న అడిషనల్‌ డీసీపీ గంగారెడ్డి

జరిగిన ఘర్షణలో ఒకరి దారుణ హత్య  

నాంపల్లి: ఇద్దరు స్నేహితులు.. ఎప్పుడూ కలిసి తిరిగేవారు.. అనుకోకుండా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. స్నేహితులు కాస్తా శత్రువులయ్యారు.. ఆమె కోసం ఒకరినొకరు చంపుకోవాలని పథకం వేసుకున్నారు. ఆ గొడవల్లో ఒకరు మరొకరిని దారుణంగా హత్య చేశాడు. సినిమా కథను తలపించే ఈ సంఘటన ఈనెల ఒకటో తేదీన ఏక్‌మినార్‌ చౌరస్తాలో జరిగిన యువకుడి హత్య ఘటనకు సంబంధించింది కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం నాంపల్లి కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి,  ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సెంట్రల్‌ జోన్‌ అడిషనల్‌ డీసీపీ గంగారెడ్డి వివరాలు వెల్లడించారు.

ఫస్ట్‌లాన్సర్‌లో నివాసం ఉండే షాహీదుద్దీన్‌(23), అజారుద్దీన్‌ అలియాస్‌ అజ్జూ(27) స్నేహితులు. జులాయిగా తిరిగే వీరిపై నగరంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులున్నాయి. ఇదిలా ఉండగా ఇద్దరు ఓ ప్రేమిస్తున్నామంటూ ఓ యువతి వెంటపడ్డారను. ఒక రోజు షాహీదుద్దీన్‌ సదరు అమ్మాయిని పట్టుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని అజారుద్దీన్‌ అలియాస్‌ అబ్బూ షాహీదుద్దీన్‌తో ఘర్షణ పడ్డాడు. ఈ వివాదంతో ఇద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. అయితే, స్నేహితులు ఇద్దరూ విడిపోయినా అమ్మాయి కోసం తరచూ తారసపడేవారు. తాను ప్రేమిస్తున్న అమ్మాయిని టీజ్‌ చేస్తున్న షాహీదుద్దీన్‌ను ఎలాగైనా హతమార్చాలని అజారుద్దీన్‌ పథకం పన్నాడు. ఇందుకు తన అనుచరులైన మహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబ్బూ, మహ్మద్‌ సలాం అలియాస్‌ సుల్తాన్‌ మీర్జా, మహ్మద్‌ అబ్దుల్‌ జునైద్‌తో కలిసి సెప్టెంబర్‌ 30న హత్య చేయడానికి కుట్ర పన్నారు. అదే రోజు రాత్రి షాహీదుద్దీన్‌ను ఫోన్‌ చేసి రాజీకి ఆహ్వానించగా అతడు తన వెంట ఓ కత్తితో అక్కడి వచ్చాడు.

నాంపల్లి ఏక్‌ మినార్‌ మసీదు సమీపంలోని 21 సెంచరీ బిల్డింగ్‌ సెల్లార్‌ వద్దకు చేరుకున్న షాహీదుద్దీన్, షేక్‌ అజారుద్దీన్, అతని అనుచరులతో కలిసి తెల్లవారు జాము వరకు మద్యం, గంజాయి తాగారు. మద్యం మత్తులో మళ్లీ అమ్మాయి విషయం వచ్చింది. దీంతో షాహీదుద్దీన్‌ కత్తి చూపించి చంపుతానని అజారుద్దీన్‌ను బెదిరించగా నలుగురూ కలిసి షాహీదుద్దీన్‌పై దాడి చేశారు. శరీరంపై ఇష్టం వచ్చినట్లు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు