పెళ్లి సంబంధం చెడగొట్టాడని హత్య

5 Apr, 2019 06:53 IST|Sakshi

వివరాలు వెల్లడించిన ఏసీపీ మహేందర్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): రెండు రోజుల క్రితం కట్కూర్‌లో కలకలం రేపిన హత్య మిస్టరీను పోలీసులు చేధించినట్లు ఏసీపీ సందేపోగుల మహేందర్‌ పేర్కొన్నారు. మండలంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఏసీపీ మహేందర్‌ మాట్లాడుతూ.. కట్కూర్‌ గ్రామానికి చెందిన బట్టమేకల రామయ్య కుమారైను, జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్‌కు చెందిన వేల్పుల రవికుమార్‌తో గత నెల 30న పెళ్లి జరగాల్సి ఉంది. కాగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలానికి చెందిన మృతుడు అరుణ్‌కుమార్‌(30), తనకు రామయ్య కుమారైతో గతంలోనే పెళ్లి జరిగిందని ఫోటోలు, వారు మాట్లాడుకున్న సంభాషణలను కాబోయే భర్త రవికుమార్‌కు పంపించడంతో పెళ్లి ఆగిపోయింది.

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ మహేందర్‌
సంబంధం చెడగొట్టాడని కోపంతో రామయ్య తన అల్లుడు బండి రవితో కలిసి పథకం ప్రకారం.. అరుణ్‌కుమార్‌ను మాట్లాడుదామని కట్కూర్‌కు పిలిచి అక్కడి నుంచి ఫత్తేపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని బోడబండ తండా సమీపంలో చంపి, పాతి పెట్టారు. దీంతో అరుణ్‌కుమార్‌ తల్లి మల్లవ్వ గత నెల 29 ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రామయ్యను విచారించగా అసలు నిజం బయటపడింది. ఘటనా స్థలంలో పాతిపెట్టిన శవాన్ని బుధవారం బయటకు తీసి పోస్టుమార్టం చేయగా, చిల్పూరు తహసీల్దార్‌ శ్రీలత శవ పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు బండి రవి, బట్టమేకల రామయ్యలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ మహేందర్‌ తెలిపారు. సమావేశంలో హుస్నాబాద్‌ సీఐ శ్రీనివాస్, ఎస్సై బానోతు పాపయ్యనాయక్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు