కట్టుకున్నోడే కడతేర్చాడు

24 Jul, 2018 06:28 IST|Sakshi
రక్తపు మడుగులో శివలక్ష్మమ్మ శిలక్ష్మమ్మ( పైల్‌)

గడివేముల: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి చివరకు అత్తారింట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గడివేములలో చోటు చేసుకుంది. మృతురా లి తల్లి, పోలీసుల వివరాల మేరకు.. గడివేములకు చెందిన నారాయణమ్మ తన కూతురు శివలక్ష్మమ్మ(28)ను ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆమె చిన్నాయన కుమారుడు మౌలాలికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి తర్వాత కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు రేణుక, ధరణి. అయితే మంగ సంతానం లేదని మౌలాలి తరుచుగా బాధపడేవాడు. దీనికితోడు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు.  నిత్యం సూటిపోటి మాటలతో ఆమెను వేధించేవాడు.

ఇటీవలే వీరి పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు కూడా చేరింది. ఓర్వకల్లు పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అనంతరం ఐదారు రోజుల క్రితం శివలక్ష్మమ్మ గడివేములలోని పుట్టింటికి వచ్చింది. శనివారం రాత్రి భర్త మౌలాలి కూడా గడివేముల వచ్చాడు. తెల్లవారుజాము సమయంలో అత్తారింట్లోనే భార్యను చంపి పరారయ్యాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, గడివేముల ఎస్‌ఐ వెంకటేశ్వరరావు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు