వీడిన యువకుడి హత్య మిస్టరీ

14 May, 2019 13:21 IST|Sakshi
మండపాకలో రోడ్డుపై బైఠాయించిన మృతుడి బంధువులు, గ్రామస్తులు

ఈ నెల 8న ప్రత్తిపాడు వద్ద యువకుడి మృతదేహం లభ్యం

హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించిన దుండగులు

వివాహేతర సంబంధమే హత్యకు కారణం

పోలీసుల అదుపులో నిందితులు

పశ్చిమగోదావరి, తణుకు : ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కనే హత్యకు గురైన ఆచూకీ తెలియని యువకుడి మిస్టరీ వీడింది. తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన యువకుడు కనిపించడంలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండపాక గ్రామంలో అదృశ్యమైన యువకుడు.. ప్రత్తిపాడు వద్ద కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న యువకుడి మృతదేహం పోలి ఉండటంతో హత్య వెనుక కుట్ర బయటపడింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మండపాక గ్రామానికి చెందిన శీలం రఘుబాబు (24) హత్యకు గురయ్యాడు. ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు దుండగులు మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే ఈ హత్య ఈనెల 8న జరిగినప్పటికీ హత్యోదంతం ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది. పెంటపాడు, తణుకు రూరల్‌ పోలీసుల సమన్వయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వివాహేతర సంబంధమే కారణం
తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన శీలం రఘుబాబు డిప్లమో పూర్తి చేసి స్థానికంగా ప్రైవేటు కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఇతనికి స్కూల్‌ స్థాయిలోనే అదే గ్రామానికి చెందిన పసుపులేటి విజయలక్ష్మితో స్నేహం ఉంది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఐదేళ్ల క్రితం సమిశ్రగూడేనికి చెందిన కిరణ్‌కుమార్‌తో విజయలక్ష్మికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. పెళ్లి అయినప్పటికీ వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండటంతో భర్త పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వీరిద్దరి తీరులో మార్పు రాకపోవడంతో తొమ్మిది నెలల క్రితమే పుట్టింటికి పంపేశారు. దీంతో రఘుబాబు, విజయలక్ష్మి తరచూ కలుసుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి సైతం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రఘుబాబు దళిత వర్గానికి చెందినవాడు కావడంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీ రాత్రి సమయంలో విజయలక్ష్మి ఇంటికి రఘుబాబు వెళ్లాడు. ఇదే సమయంలో విజయలక్ష్మి సోదరుడు గ్రామ వీఆర్‌ఏగా పనిచేస్తున్న పసుపులేటి మణికంఠ ఇంట్లోనే ఉన్నాడు. దీంతో వీరిద్దరు ఘర్షణ పడ్డారు. ఇదే సమయంలో మొగల్తూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన మేనమామ యర్రంశెట్టి నాగబాబుకు ఫోన్‌ చేయడంతో ఆయన అక్కడి నుంచి బయల్దేరి వచ్చాడు. విజయలక్ష్మి విషయంలో రఘుబాబు, మణికంఠ, నాగరాజుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

ఆటోలో తీసికెళ్లి..
అదే రోజు రాత్రి విజయలక్ష్మి ఇంట్లోనే ముగ్గురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని వేరే ప్రాంతంలో కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ చింతపల్లి దుర్గారావును పిలిచి నలుగురు కలిసి ఆటోలో బయల్దేరారు. మాట్లాడుకుందామని చెప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కనే నిర్జీవ ప్రదేశానికి తీసికెళ్లి రఘుబాబును హత్య చేశారు. మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు వారితో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అయితే రఘుబాబు కనిపించడంలేదని పేర్కొంటూ తణుకు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో తండ్రి మోహనరావు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈనెల 9న ప్రత్తిపాడు వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు రఘుబాబు పోలికలు ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. దళిత యువకుడిని అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు హత్య చేశారని పేర్కొంటూ పెద్ద సంఖ్యలో బంధువులు, గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. పైడిపర్రు–మండపాక రోడ్డుపై బైఠాయిండంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొవ్వూరు డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐలు చైతన్యకృష్ణ, విజయబాబు, ఎస్సైలు డి.ఆదినారాయణ, వి.జగదీశ్వరరావు, ఎన్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు