నీకు ప్రధాని తెలీదా?

27 May, 2018 13:54 IST|Sakshi
వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం

మాల్దా: ‘నాకు చదువు రాదు.. బయటి విషయాలు నాకు పెద్దగా తెలీదు’  అని చెబుతున్నా వినకుండా ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా కొందరు చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ చోటు చేసుకోగా, ఆ ఘటన తాలుకూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

బాధితుడి కథనం ప్రకారం... కలియాచక్‌(మాల్దా జిల్లా)కు చెందిన సదరు యువకుడు, హౌరా పట్టణంలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ నెల 14వ తేదీన సదరు యువకుడు రైల్లో తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గం మధ్యలో నలుగురు వ్యక్తులు రైలు ఎక్కి అతని ముందు సీట్లో కూర్చున్నారు. ముందు సరదాగా అతనితో మాటలు కలిపిన ఆ నలుగురు.. తర్వాత విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టారు. మన ప్రధాని ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జాతీయ గీతం పాడు? అంటూ ఆ యువకుడిని కోరారు. 

అయితే తడబడుతూనే సమాధానాలు చెప్పేందుకు యత్నించిన ఆ యువకుడి చెంప పగలకొట్టారు. తాను పెద్దగా చదువుకోలేదని.. ఆ విషయాలు అంతగా తెలీదని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని వాళ్లు మరింతగా రెచ్చిపోయారు. సంభాషణ మధ్యలో అతను ముస్లిం అని గ్రహించిన ఆ నలుగురు.. నమాజ్‌ ఎలా చదవాలో నీకు తెలుసు కదా? అని ప్రశ్నించారు. దానికి అతను అవుననే సమాధానం ఇచ్చాడు. అలాంటప్పుడు జాతీయ గీతం గురించి తెలీదా? అంటూ దుర్భషలాడుతూ చెయ్యి చేసుకున్నారు. ఆపై బందేల్‌ స్టేషన్‌లో  ఆ నలుగురు దిగిపోయారు. ఓ ప్రయాణికుడు అదంతా వ్యక్తి దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయగా, అది కాస్త వైరల్‌ అయ్యింది. చివరకు బంగ్లా సంక్రీతి అనే ఎన్టీవో ఇచ్చిన ఫిర్యాదుతో కలియాచక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు