హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు

28 May, 2019 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ/బెగుసరాయ్‌: హరియాణలోని గుర్గావ్‌లో నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఓ ముస్లిం వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహ్మద్‌ బాకర్‌ ఆలం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ‘ఈ నెల 25న నేను సదర్‌ బజార్‌ ప్రాంతంలో ఉండగా నలుగురు మనుషులు నన్ను పిలిచారు. నేను తలపై టోపీ ధరించడం పట్ల వారు అభ్యంతరం తెలుపుతూ, నా టోపీ తీసేసి నన్ను చెంపదెబ్బలు కొట్టారు. భారత మాతకు జై అని అనమన్నారు. నేను వాళ్లు చెప్పినట్లు చేయడంతో మళ్లీ జై శ్రీరామ్‌ అని జపించమన్నారు. నేను తిరస్కరించడంతో వాళ్లు కర్రలు తీసుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు’ అని పేర్కొన్నాడు. మరో ఘటనలో బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లా బరియార్‌పూర్‌లో వీధి వ్యాపారి అయిన ముస్లిం వ్యక్తి మహ్మద్‌ ఖాసింను రాజీవ్‌ యాదవ్‌ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. ఇది విద్వేష దాడి అయ్యుండొచ్చని పోలీసులు సోమవారం చెప్పారు. ఆసుపత్రిలో ఖాసిం చికిత్స పొందుతున్న ఖాసిం, తనపై జరిగిన దాడిని ఓ వీడియోలో వివరించాడు.

మరిన్ని వార్తలు