వీడిన కాకినాడ జంట హత్య కేసు మిస్టరీ!

7 Oct, 2019 14:48 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: నాలుగు నెలల క్రితం కాకినాడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకినాడ టూటౌన్ పోలీసులు.. సోమవారం నిందితుడు వీర్రాజును అరెస్టు చేశారు. పోలీసులు  వివరాల ప్రకారం.. నిందితుడు వీర్రాజు గతంలో రెండేళ్ల పాటు అదే ఇంట్లో అద్దెకు ఉన్నాడనీ, స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు రావడంతో చోరీలకు పాల్పడేవాడు. అదే క్రమంలో చోరీకి పాల్పడుతూ అడ్డుకున్న దంపతులను హత్య చేశాడు. ఈ క్రమంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు పలు డాక్యుమెంట్లను తగులబెట్టాడు.

కాగా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.  భార్యభర్తలను హత్య చేసిన ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు చేసిన కేవలం మూడు సెకండ్స్‌ ఫోన్‌ కాల్ ఆధారంగా కేసును చేధించామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అంతేకాక అతని నుంచి రూ. 4 లక్షల 75 వేల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నట్లు మీడియాకు వివరించారు.

మరిన్ని వార్తలు