కారుతో ఢీకొట్టి కిడ్నాప్‌ చేసిన కేసులో వీడిన మిస్టరీ!

8 Oct, 2019 09:01 IST|Sakshi

కిడ్నాప్‌ కాదు.. హత్యాయత్నం!

ప్రియుడితో కలిసి ‘ఆమె’ పథకం

సహకరించిన మరో ముగ్గురు

రెండు రోజుల్లో మిస్టరీని ఛేదించిన పోలీసులు

సాక్షి, బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట శివారులో ఈనెల 5న దంపతులు బైక్‌పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి భార్యను కిడ్నాప్‌ చేసిన సంఘటనలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, నర్మెట సీఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పారుపెల్లికి చెందిన బండ తిరుపతి– భాగ్యలక్ష్మి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైనది. భాగ్యలక్ష్మికి అన్నదమ్ములు లేక పోవడంతో తిరుపతి ఇళ్లరికం వెళ్లాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఒక పాప ఉంది. భాగ్యలక్ష్మి తండ్రి ఆర్‌ఎంపీగా సేవలందిస్తున్నాడు. ఆయన వద్దకు పక్క గ్రామమైన బొందుగులకు చెందిన మరో ఆర్‌ఎంపీ పుట్ట బాల్‌నర్సయ్య వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కొంతకాలం నుంచి తిరుపతి భార్యపై అనుమానంతో వేధించసాగాడు. ఈ విషయాన్ని భాగ్యలక్ష్మి బాల్‌నర్సయ్యకు చెప్పడంతో తిరుపతిని ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశారు. 

పక్కా పథకం ప్రకారం..
భాగ్యలక్ష్మి ప్రియుడు బాల్‌నర్సయ్య మిత్రుడు అమరాజు సిద్ధులు హైదరాబాద్‌లో బీడీఎల్‌లో డ్రైవర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పథకం గురించి నర్సయ్య సిద్దులుకు మూడు నెలల క్రితం తెలుపగా మహబూబాద్‌ జిల్లా బయ్యా రం మండలం గంధంపల్లికి చెందిన మల్సూర్, కేసముద్రం మండలానికి  చెందిన లక్ష్మీనారాయణతో కలిసి హత్య చేయడానికి ఒప్పుకుంటారు. ఇందుకుగాను రూ.5 లక్షలు సుపారీ మాట్లాడుకోగా బాల్‌న్సయ్య అడ్వాన్స్‌గా రూ. లక్ష ఇవ్వగా ఆ ముగ్గురు పంచుకున్నారు. ఈ డబ్బుతో హత్యకు అవసరమైన కా>రును సిద్ధులు ఆలేరు పట్టణంలో రూ.17వేలతో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న తిరుపతి, భాగ్యలక్ష్మి జనగామ ఆస్పత్రికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తుండగా పోచన్నపేట శివారులో కారులో వచ్చి ఢీకొట్టా రు. ఈ ఘటనలో గాయపడిన తిరుపతిని పొల్లోకి లాక్కెళ్లి జే వైరుతో ఉరిపెట్టారు. ఆ సమయంలో గొర్లకాపర్లు రావడంతో గాయపడిన భాగ్యలక్ష్మిని కారులో తీసుకుని పోచన్నపేటకు వెళ్లారు. అక్కడి నుంచి బాల్‌నర్సయ్య భాగ్యలక్ష్మి జనగామకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అయితే సంఘటన స్థలంలో అపస్మారకస్థితిలోకి వెళ్లిన తిరుపతిని అటుగా వచ్చిన వారు గమనించి 108లో జనగామ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేష్, ఎస్సై రంజిత్‌రావు వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

నలుగురు అరెస్టు

స్వాధీనం చేసుకున్న వాహనం  వద్ద డీసీపీ, ఏసీపీ పోలీసులు; మాట్లాడుతున్న జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి

దర్యాప్తులో భాగంగా నర్మెట సీఐ సంతోష్‌కుమార్‌ ఆదేశాలతో ఎస్సై రంజిత్‌రావు, ప్రొహిబిషన్‌ ఎస్సై ప్రశాంత్‌ బొందుగుల గ్రామంలోని ఇంట్లో బాల్‌నర్సయ్యతో సహా అతడికి సహకరించిన సిద్ధులు, లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేశా రు. విచారణ చేపట్టగా హత్యాయత్నం ఘటనలో భాగ్యలక్ష్మి పాత్ర ఉందని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి మ న్సూర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రూ.30,430 నగదు, బైక్, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులు రెండు రోజుల్లోనే ఛేదించిన ఎస్సైలు రంజిత్‌రావు, ప్రశాంత్‌లను డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ సంతోష్‌కుమార్‌ అభినందించారు.  

మరిన్ని వార్తలు