కువైట్‌లో నడిపల్లి యువకుడి మృతి

12 Sep, 2019 10:23 IST|Sakshi
నరేశ్‌ (ఫైల్‌) 

సాక్షి, డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన బోండ్ల నరేశ్‌ (33) కువైట్‌లో బ్రెయిన్‌ ఫెయిల్యూర్‌తో మృతి చెందినట్లు సర్పంచ్‌ కులాచారి సతీశ్‌రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితమే నరేశ్‌ గల్ఫ్‌లోని కువైట్‌కు వెళ్లాడు. కంపెనీలో పని చేసినా సరైన వేతనం ఇవ్వక పోవడంతో కంపెనీ వదిలి బయటకు వచ్చాడు. అయినా సరైన పనులు దొరకక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి కార్మికులు సమాచారం అందించారని సర్పంచ్‌ పేర్కొన్నారు. ఒత్తిడి ఎక్కువై నరేశ్‌ మృతి చెందినట్లు బుధవారం కుటుంబసభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, తెలంగాణ జాగృతి ప్రతినిధులు నరేశ్‌ మృతదేహాన్ని నడిపల్లికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. మృతుడికి భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  

మరిన్ని వార్తలు