నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

26 Feb, 2020 07:33 IST|Sakshi

కేసు నమోదు చేసిన సైబర్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన అంతర్జాతీయ టేబుల్‌ టెన్సిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌ను గుర్తుతెలియని దుండగులు హ్యాక్‌ చేశారు. దీనిపై ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు  ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కాచిగూడలో నివసించే నైనా జైస్వాల్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్‌ టెన్నిస్‌ ఆడి అనేక టైటిల్స్‌ కైవసం చేసుకున్నారు.

దీంతో పాటు ఎనిమిదో ఏటనే టెన్త్, పదో ఏట ఇంటర్మీడియట్, 13వ ఏట డిగ్రీ, 15 ఏట పీజీ పూర్తి చేసిన ఆమె 17వ ఏట నుంచే పీహెచ్‌డీ చేయడం ప్రారంభించారు. తన రెండు చేతులతోనూ ఏకధాటిగా రాయగలగడంతో పాటు మోటివేషనల్‌ స్పీకర్‌గానూ పేరున్న నైనా జైస్వాల్‌ ఫేస్‌బుక్‌కు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీన్ని హ్యాక్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి పాస్‌వర్డ్‌ మార్చేశాడు. దీంతో నైనా సైతం తన ఖాతాను యాక్సస్‌ చేయలేకపోతున్నారు. ఈ ఖాతాలోకి సదరు దుండగుడు కొన్ని వీడియోలను అప్‌లోడ్‌ చేశాడు. దీంతో ఆమె మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

మరిన్ని వార్తలు