హనీమూన్‌ విషాదాంతం: నవ వధువు మృతి

18 Jan, 2018 09:10 IST|Sakshi

భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం  చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ సంఘటన అనంతరం  తమన్నా  భర్త పరారీలో ఉండటం మరింత అనుమానాలకు  తావిస్తోంది. 

వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన తమన్నా,  షాదాబ్ లకు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయింది. ఈ నెలలో కొత్త జంట  హనీమూన్‌ కోసం నైనిటాల్‌ వెళ్లింది. తాము ఇద్దరం సెల్పీ తీసుకుంటుండగా  హఠాత్తుగా అక్కడ పాము కనిపించిందని, దీంతో భయపడిన తమన్నా అనుకోకుండా వెనక్కి జరుగుతూ.. సుమారు  250 అడుగుల లోయలోకి పడిపోయిందని, తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందనేది తమన్నా భర్త చెబుతున్నకథనం.

క్యాడ్‌ డ్రైవర్‌  అందించిన సమాచారం ప్రకారం.... జనవరి 15న  నైనిటాల్‌ సైట్‌ సీయింగ్‌ కోసం ఈ కొత్త జంట క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. మధ్యలో తమన్నా కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో..దంపతులు ఇద్దరూ  క్యాబ్‌ దిగి  కొండవాలు వైపు నడుచుకుంటూ వెళ్లారని, ఇంతలో అరుపులు, ఏడుపులు వినడంతో తాను అక్కడకు చేరుకోగా..  పామును చూసి భయపడి తన భార్య లోయలో పడిపోయిందని షాదాబ్‌ చెప్పినట్లు తెలిపాడు. వెంటనే స్థానికుల సహాయంతో  ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు డ్రైవర్‌ పేర్కొన్నాడు.

తన సోదరిని కట్నం కోసమే షాబాద్‌  చంపేశాడని తమన్నా సోదరుడు  అరిఫ్‌  ఫిర్యాదు చేయడంతో పోలీసులు,  దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం తమన్నా మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించినట్లు టైనిటాల్ పోలీసు స్టేషన్ అధికారి ప్రమోద్ పతక్ తెలిపారు.

మరిన్ని వార్తలు