నందమూరి వసుంధర సంతకం ఫోర్జరీ

17 Feb, 2020 07:24 IST|Sakshi

బంజారాహిల్స్‌: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌ బంజారాహిల్స్‌ బ్రాంచ్‌లో మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ను తయారు చేసిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బంజారాహిల్స్‌ బ్రాంచ్‌ మేనేజర్లు ఫణింద్ర, శ్రీనివాస్‌ ఈ నెల 13న ఆమె ప్రతినిధి వెలగల సుబ్బారావుకు ఫోన్‌ చేసి నందమూరి వసుంధర మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె అకౌంట్‌ నంబర్‌ కూడా చెప్పి అకౌంట్‌ను యాక్టివేట్‌ చేయమంటారా? అంటూ ప్రశ్నించారు.

తాము మొబైల్‌బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని, అసలు దరఖాస్తే చేసుకోలేదని చెబుతూ ఈ విషయాన్ని వసుంధర దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కూడా తాను ఎలాంటి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేసింది. బ్యాంకు అధికారులు ఆరా తీయగా కొత్తగా వచ్చిన అకౌంటెంట్‌ కొర్రి శివ ఇటీవల వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ ఇచ్చినట్లుగా తేలింది. దీనిపై శివను నిలదీయగా మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం తాను ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తు చేసినట్లుగా అంగీకరించాడు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికారులు కూడా వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా వెల్లడించారు.  సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొర్రి శివపై పోలీసులు   క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు