మాజీ డిప్యూటీ సీఎంకు బెయిల్

4 May, 2018 16:31 IST|Sakshi
గతంలో ఛగన్ భుజ్‌బల్ .. ప్రస్తుతం ఇలా..

సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్‌(71)కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ ల్యాండర రెండేళ్ల జైలుశిక్ష అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు విన్నవించుకున్న భుజ్‌బల్, డిసెంబర్‌లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లపై తీసుకున్న నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రూ.5 లక్షల పూచీకత్తుపై బాంబే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ముంబైలోని ఆర్థర్ రోడ్‌ జైల్లో గత రెండేళ్లుగా భుజ్‌బల్‌తో పాటు ఆయనతో పాటు అక్రమ ఆస్తులు కూడబెట్టిన బంధువులు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలడంతో భుజ్‌బల్, ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. భుజ్‌బల్, ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజ్‌బల్‌పై నమోదయ్యాయి. 

2016 మార్చిలో భుజ్‌బల్‌ను ముంబై ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కాం, మహారాష్ట్ర సదన్ స్కాంలతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. దాదాపు రూ.870 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు భుజ్‌బల్‌పై ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు