యువ దంపతుల ఆత్మహత్య

5 Oct, 2018 09:09 IST|Sakshi

మృతులు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

బోడుప్పల్‌: యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోడుప్పల్‌లో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .నాచారంలోని చింతల్‌బస్తీకి చెందిన ఎల్లసాని నవనీత్‌ యాదవ్‌ (27), స్వప్న (26)ఏడాది క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నవనీత్‌ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, స్వప్న హబ్సిగూడలోని జెన్‌ప్యాక్‌ కాల్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె 9నెలల గర్భిణి.

ఆరు నెలల క్రితం బోడుప్పల్, అశోక్‌నగర్‌కు మారిన వీరు ఓ భవనంలో పెంట్‌ హౌజ్‌లో అద్దెకు ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటికి రాకపోవడం. స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో నవనీత్‌ తల్లి గురువారం రాత్రి వారి ఇంటికి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి ఇంటి యజమానికి చెప్పడంతో అతను అనుమానంతో మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో నవనీత్, స్వప్న మృతదేహాలను కనిపించాయి. పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో పురుగుమందు తాగి అత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మేడిపల్లి సీఐ అంజిరెడ్డి, మల్కాజ్‌గిరి ఏసీపీ గోనె సందీప్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు