రోడ్డు ప్రమాదంలో నూతన దంపతుల మృతి 

12 Mar, 2019 02:45 IST|Sakshi

గుండాల : యాదాద్రిభువనగిరి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నూతన దంపతులు మృతి చెందారు. గుండాల మం డలం బ్రాహ్మణపల్లికి చెంది న బెజాడి కుమార్‌ కుమారుడు బెజాడి నరేశ్‌కు (27) గత నెల 22న భువనగిరి మండలం కేసారం గ్రామా నికి చెందిన దివ్య (24)తో వివాహం జరిగింది. నరేశ్‌ తండ్రి కుమార్‌ ఉద్యోగ రీత్యా ఆర్టీసీ డ్రైవర్‌. కుటుంబంతో మేడిపల్లిలో నివాసం ఉంటున్నారు. నరేశ్‌ హైదరాబాద్‌లో వైకుంఠ రథం డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో అక్కడే ఉంటున్నాడు.

ఆదివారం ఉదయం నరేశ్‌ భార్యతో కలసి తన పెద్దమ్మ స్వగ్రామం ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లిలో శుభకార్యానికి వచ్చాడు. తిరిగి సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై తన అత్తగారి ఊరు కేసారం గ్రామానికి వెళ్లే క్రమంలో స్థానిక బస్టాప్‌ వద్ద ఆగి ఉన్న ట్రాన్స్‌పోర్టు లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా అనంతరం మృతదేహాలను వారికి అప్పగించారు. 

మరిన్ని వార్తలు