పెళ్లయిన కొద్ది గంటలకే ప్రమాదం

12 Nov, 2018 07:13 IST|Sakshi
తీవ్రగాయాలతో ఉన్న నవ వధూవరులు ఎర్రయ్య, హారిక ,ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్న కొత్త దంపతులు ప్రయాణిస్తున్న కారు

ఆగి ఉన్న బస్సును ఢీకొన్న కారు

తీవ్రంగా గాయపడిన నవ వధూవరులు

మరో ఇద్దరికి గాయాలు

కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు

విశాఖపట్నం, ఆనందపురం(భీమిలి): వివాహ వేడుకను ఘనంగా నిర్వహించిన రెండు కుటుంబాల వారు ఆనందడోలికల్లో మునిగి తేలారు. కొత్తకాపురం పెట్టబోయే దంపతులను మనసారా ఆశీర్వదించి దేవుని ఆశీస్సులు పొందిరండని పంపారు. అయితే గంటల వ్యవధిలోనే ఆ నవ వధూవరులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారన్న సమాచారం అందుకున్న ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. భీమిలి తోటవీధికి చెందిన హారికకు విజయనగరం రింగ్‌రోడ్‌ సమీపంలోని అశోక్‌నగర్‌కు చెందిన కారి ఎర్రయ్యతో ఆదివారం(11వ తేదీ) తెల్లవారు జామున అశోక్‌నగర్‌లో ఉన్న షాదీఖానాలో వివాహం జరిగింది. పెళ్లయిన వెంటనే సింహాచలంలో అప్పన్నస్వామిని దర్శించుకుని రండని నూతన వధూవరులను వారి తల్లిదండ్రులు పంపించారు.

ఎర్రయ్య, హారిక (ఫైల్‌ ఫొటో)
సింహాచలంలో స్వామివారి దర్శనం అయిన వెంటనే భీమిలి తోటవీధికి కారులో బయలుదేరారు. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వస్తున్న బస్సు లొడగలవానిపాలెం వద్దకు చేరుకునే సరికి మరమ్మతులకు గురైంది. దీంతో సిబ్బంది బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. సింహాచలం నుంచి వస్తున్న కొత్త దంపతుల కారు లొడగలవానిపాలెం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో ఎర్రయ్య, హారికలు, వారితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సోమరాజు, సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు.  ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు