తాగి నడిపితే.. తాట తీసుడే..!

19 Sep, 2019 11:02 IST|Sakshi
డ్రంకెన్‌డ్రైవ్‌లో బ్రీత్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌

డ్రంకెన్‌డ్రైవ్‌పై నూతన చట్టం అమలు

పట్టుబడితే రూ.10వేలు జరిమానా

15 రోజుల్లో రెండు కేసులు నమోదు

ప్రభుత్వం వెనక్కి తగ్గినా.. కోర్టులు సీరియస్‌

తరుచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే. వాటి నివారణకు కొత్త మోటారు వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గింది. కా నీ మద్యం తాగి పట్టుబడితే కోర్టులు జరి మానాలతోపాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్‌ పాటించకుంటే భారీగా జరిమానా విధిస్తున్నాయి. 

సాక్షి, మంచిర్యాల: తరుచుగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే... వాటి నివారణకు కొత్త వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా.. కోర్టులు మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నాయి. మద్యం తాగి పట్టుబడితే.. జరిమానాలతో పాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్‌ పాటించకుంటే జేబుకు చిల్లు పడడమే. కొత్తచట్టం అమలై 15రోజుల్లోనే జిల్లాలోని ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరిస్తే మేలు...  

కొత్తచట్టం తీరు...
సెప్టెంబర్‌ 1 నుంచి వాహన కొత్త చట్టం అమలవుతోందని వాహనదారుల్లో తీవ్రమైన భయాందోళనలో పడిపోయారు. 1వ తేదీన వాహనం పట్టుకొని రోడ్డుమీదికి రావాలంటే వెన్నులో వణుకు మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన కొత్త చట్టం అమలు చేసేందుకు కొంత గడువు ఇచ్చినట్లు ప్రకటన చేయగానే వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా అమలవుతున్న కొత్త వాహన చట్టంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయనున్నట్లు ప్రకటన చేసింది. కానీ ఏమి లాభం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో మాత్రం కొత్త చట్టాన్ని కోర్టులు తూ.చ తప్పకుండా అమలు చేస్తోంది. తాగి వాహనాలు నడిపిన వారి తాటతీయడం మొదులు పెట్టింది.

పునరాలోచన...
వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి కొత్త వాహన చట్టం బిల్లును కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా అమలు చేసింది. కొత్త వాహన చట్టం అమలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి పునరాలోచన చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త వాహన చట్టంలోని నిబంధనలు సవరించే దిశలో పునరాలోచన చేయనుంది. కొత్త చట్టంలో మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు సైతం జైలుకు వెళ్లాల్సి ఉండేది. ఇలా ఒక్కటి కాదు మోటర్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానా విధించడం, జరిమానాతో పాటు జైలు శిక్ష, చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టం సెక్షన్‌ – 199 ప్రకారం పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ.25వేలు జరిమానా విధిస్తూ మూడేళ్ల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్‌ రద్దు చేసే అవకాశం ఉండేది. అంటే సదరు వాహనాం మళ్లి రోడ్డెక్కె అవకాశం లేదు. ఇక ఉద్యోగులైతే ఉద్యోగం సైతం కోల్పోయే అవకాశం, దీంతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేయడం ఉంది. ఒక వేల పిల్లలు ప్రమాదం చేస్తే వారి తల్లిదండ్రులను లేదా సంరక్షకులను దోషులుగా నిర్ధారించింది. రోడ్డుపై వెళ్లే అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయిన రూ.10వేలు జరిమానా చెల్లించే విధంగా, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో సైతం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధించేల చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో అమలుకు బ్రేకులు వేసింది.

జిల్లాలో సుమారు 20లక్షల వాహనాలు
జిల్లాలో 8 లక్షల వరకు రవాణా వాహనాలు ఉండగా 12లక్షల వరకు రవాణేతర వాహనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఘనంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదాల కారణాలపై నిపుణుల సర్వే ప్రకారం అధికంగా మద్యం మత్తులో, మితిమీరన వేగం, ట్రాఫిక్‌ నింబంధనలు పాటించకపోవడంతో జరిగే రోడ్డు ప్రమాదాలే అధికం. ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, స్వల్ప జరిమానాలు విధించిన వాహనదారుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తూ కఠినతరం చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులతో పాటు, రవాణా శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను కోర్టుకు అప్పగించడంతో న్యాయమూర్తులే నూతన చట్టాన్ని అమలు చేస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పాత చట్టం ప్రకారం రూ.2వేలు జరిమానా, జైలు శిక్ష విధించేవారు. కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధిస్తున్నారు.

కొత్తచట్టం ప్రకారం రెండు కేసులు... 
కొత్త వాహన చట్టం ప్రకారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో చెన్నూర్‌ కోర్టులో ఇద్దరికి  రూ.10వేల చొప్పున  జరిమానా విధిస్తూ  జైలు శిక్ష ఖరారు చేశారు. దీంతో మందుబాబుల గుండెల్లో బండరాయి వేసినట్‌లైంది. ఒక పక్కకొత్త చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఇదేందని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కోర్టుకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రానందున సెప్టెంబర్‌ 1 నుంచి అమలైన కొత్తవాహన చట్టాన్ని అమలు చేస్తున్నారని పాతచట్టం ప్రకారం రూ.2వేల జరిమానా విధించాల్సి ఉండగా కొత్త చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధిస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. కొత్తవాహన చట్టంలోని నిబంధనలు, జరిమానా వివరాలు  పోలీస్‌ ట్యాబ్‌లో ఆన్‌లైన్‌ చేయలేదని, దీంతో పాత వాహన చట్టం అమలులో ఉందని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు.

15రోజులు రెండు కేసులు
ఈ నెల9న జైపూర్‌ మండలంలోని గంగిపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మద్యం సేవించి  వాహనం నడుపగా జైపూర్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తెలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్‌ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనతంరం నారాయణరెడ్డి అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో  న్యాయమూర్తి సాయికుమార్‌ కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా విధించారు.

ఈ నెల 15న భీమారం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టి.రాజం అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా భీమారం పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్‌ కోర్టులో హాజరు పరుచగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.10వేలు జరిమాన విధిస్తూ ఒక్క రోజు జైలు శిక్ష విధించారు. ఇక తాగి వాహనాలు నడిపితే అంతే సంగతి... జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పని పరిస్థితి...

కోర్టు జరిమానా విధిస్తుంది..
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులు కేసులు నమోదు చేయడం మట్టుకే పరిమితం జరిమానాలు, శిక్షలు కోర్టు ఆధీనంలో ఉంటుంది.. మద్యం సేవించి వాహనం నడిపిన వారికి పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచేంత వరకు మా పని జరిమానా, జైలు శిక్ష అదంత కోర్టు న్యాయమూర్తులు చూసుకుంటారు. మోటర్‌ వెహికిల్‌ కొత్త చట్టం ఇంక అమలుకాలేదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు, ప్రతి వాహనదారులు హెల్మెట్, సీట్‌ బెల్ట్, వాహనాల పత్రాలు విధిగా పాటించాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పని సరి, ఎవరిని ఊపేక్షించేది లేదు. 
– ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్‌ సీఐ, మంచిర్యాల 

మరిన్ని వార్తలు