తండ్రిపై కూతురు, కుమారుడు ఫిర్యాదు
తనపైనే దాడి చేశారంటున్న తండ్రి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హయత్నగర్ ప్రేమ పెళ్లి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కులాంతర వివాహం గొడవకు కారణం కాదని... భార్య, కూతురు అబద్ధాలు చెప్తున్నారని నరసింహగౌడ్ ఆరోపిస్తున్నారు. తన భార్య, కుమార్తె కలిసి తనను చంపేందుకు క్షుద్రపూజలు చేయిస్తున్నారని... ఆ భయంతో తాను కొంతకాలంగా దూరంగా ఉంటున్నారని ఆయన తెలిపారు. అయితే కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇంటికి వస్తే... వాళ్లే తనపై దాడిచేశారని పేర్కొన్నారు.
కాగా లెక్చరర్స్ కాలనీలో నివసించే వీరమల్లు నర్సింహగౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు భార్య సావిత్రి, కూతురు రమాదేవి, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్సింహగౌడ్ కొంతకాలంగా ఎల్బీ నగర్లో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం తన వ్యాపార లావాదేవీలకు చెందిన పత్రాలను తీసుకునేందుకు నర్సింహగౌడ్ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో రమాదేవి, సాయికిరణ్, సావిత్రి కలిసి తనను ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని, చంపేందుకు ప్రయత్నిస్తే స్థానికులు సహాయంతో తప్పించుకుని వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేక తండ్రి తన అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని కూతురు రమాదేవి, కొడుకు సాయికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.