షీ మ్యాన్‌ ! ఆమే.. అతడు

9 Nov, 2019 07:55 IST|Sakshi
సుమలత నివాసంలో పోలీసులు సీజ్‌ చేసిన విగ్‌

‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం

జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన సుమలత వ్యవహారం

తాజా తనిఖీల్లో మగవారు ధరించే విగ్‌ లభ్యం

మరో ఏడు ప్రేమ లేఖలు సీజ్‌

మరిన్ని ఆధారాల సేకరణలో పోలీసులు

ఒంగోలు: జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారిన సుమలత కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళే మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు లభ్యమైంది. సుమలతే మగవాడిలా విగ్‌ పెట్టుకొని సాయి అనే పేరుతో చలామణి అయినట్టు తెలుస్తోంది. కంఠంతోపాటు మగవాడిలా వేషం మార్చి కథ నడిపిందన్న బాగోతం వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించిన ఆధారాలుసేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితురాలు సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోవడం, ఫోక్సో కేసులో ఆమె రిమాండ్‌లో ఉండడంతో దర్యాప్తు కోసం సాంకేతిక సహకారంతోపాటు భౌతిక సాక్ష్యాల కోసం వేట మొదలు పెట్టారు.

కేసును విచారణలో భాగంగా సింగరాయకొండ సీఐ టీఎక్స్‌ అజయ్‌కుమార్‌ శుక్రవారం సుమలత నివాసం ఉండే ఒంగోలు మారుతీనగర్‌లోని పెంట్‌ హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రేమ లేఖలను సీజ్‌ చేశారు. అవన్నీ నోటు పుస్తకాలను చించి రాసినట్లుగా ఉన్నాయి. వాటిలో మూడు లేఖలు ‘హాయ్‌’ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు మాత్రం ‘సాయి చరణ్‌’ పేరుతో ఉన్నాయి. దీంతో సాయిచరణ్‌ అన్న పేరు కేవలం కల్పితం అన్న విషయం రూఢీ అయింది. పొడవాటి జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సంశయం కూడా తాజా తనిఖీలలో గుర్తించిన విగ్‌తో వీగిపోయింది.  పొడవాటి జడ సైతం అందులో ఇమిడి పోయే మగవారు ధరించే విగ్‌ శుక్రవారం తనిఖీల్లో పోలీసులకు లభ్యమైంది. దీంతో బాలికలను ఆకట్టుకునే క్రమంలో సుమలతే సాయిచరణ్‌గా వేషం ధరించేదనే నిర్ధారణకు వచ్చారు.

ప్రేమ లేఖలపై సస్పెన్స్‌..
పోలీసులు సీజ్‌ చేసిన ఏడు ప్రేమ లేఖల్లో ఒకే చేతిరాత ఉన్నప్పటికీ ఎక్కడా దిగువన సంతకాలు మాత్రం లేవు. దీంతో వాటిని రాసింది ఎవరనేది నిర్థారణ చేయాల్సి ఉంది. సుమలత జీవితానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ఎందుకు ‘షీ మ్యాన్‌’లా వ్యవహరిస్తుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. (చదవండి: ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు)

మరిన్ని వార్తలు