పారాణి ఆరకముందే..

12 Mar, 2019 12:26 IST|Sakshi
రోడ్డుపై పడిఉన్న నూతన దంపతుల మృతదేహాలు

సాక్షి,భువనగిరిఅర్బన్‌ : అగి ఉన్న లారీని బైక్‌ ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై ఉన్న నవ దంపతులు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని కూనూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన బేజాడి కుమారస్వామి కుమారుడు బేజాడి నరేష్‌(29) సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బేజాడి నరేష్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన భువనగిరి మండలంలోని కేసారం గ్రామానికి చెందిన బాల్ద మల్లేష్‌ కుమార్తె దివ్య(21)తో వివాహమైంది. కాగా బ్రహ్మణపల్లి గ్రామం నుంచి బేజాడి నరేష్‌ తన బైక్‌పై భార్య దివ్యతో కేసారం గ్రామానికి బయలుదేరారు.

ఈ క్రమంలో మోత్కూర్‌ వైపు నుంచి రాయగిరి వైపునకు వస్తుండగా మండలంలోని కూనూరు గ్రామ శివారులోని యాదాద్రి ఫంక్షన్‌హాల్‌ వద్ద అగి ఉన్న ఓ ట్రాన్స్‌ఫోర్టు లారీని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు రోడ్డుపై ఎగిరిపడటంతో వారి తలలకు తీవ్ర గాయాలై అక్కడిక్కక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీస్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మిన్నంటిన రోదనలు  
ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో నవదంపతులు నరేష్, దివ్య మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఇరు కుటుంబాల బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడి తండ్రి కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు