గూగుల్‌లో వెతికి మరి చంపాడు

30 Jun, 2018 11:11 IST|Sakshi
శైలజా ద్వివేది - నిఖిల్‌ హండా (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన శైలజ ద్వివేది హత్య కేసులో పోలిసులు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. శైలజ ద్వివేదిని హత్య చేసని నిఖిల్‌ హండా ప్రస్తుతం 14 రోజుల జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే నేపంతో నిఖిల్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ముందు ఈ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు చిక్కాడు. అయితే పోలీసుల విచారణలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్‌ హండా గూగుల్‌ సాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి’ వంటి పలు అంశాల గురించి నిఖిల్‌ గూగుల్‌లో సర్చ్‌ చేసినట్లు  పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా నిఖిల్‌ ఫోన్‌ కాల్‌ డేటాను, ఇంటర్నెట్‌ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. ఈ విషయం గురించి పోలీసులు ‘శైలజ, నిఖిల్‌ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్‌ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు.

అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేశి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పొనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్‌, జీన్స్‌ ప్యాంట్‌లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హరిద్వార్‌ నుంచి మీరత్‌ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు.

కానీ నిఖిల్‌ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్‌ ఆధారంగానే నిఖిల్‌ను అరెస్ట్‌ చేశాము. ప్రస్తుతం ఈ సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ లాబ్‌కి పంపించారు. నివేదికల కోసం ఎదురు చూస్తున్నామ’ని తెలిపారు. 

మరిన్ని వార్తలు