హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

25 Nov, 2018 20:06 IST|Sakshi

సిమ్లా‌: కర్నాటకలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మరణించిన ఘటన మరువకముందే హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సిర్మౌర్‌లో ఓ ప్రైవేటు బస్సు అనూహ్యంగా అదుపుతప్పి జలాల్‌ వంతెనపై నుంచి నదిలో పడడంతో 9 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని అడిషనల్‌ ఎస్పీ వీరేంద్ర సింగ్‌ ఠాకూర్‌ చెప్పారు.

కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రైవేటు బస్సు శ్రీ రేణుకాజీ ప్రాంతం నుంచి నాహాన్‌కు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం  40 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారిని నాహాన్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు