ములకలపల్లి : బాలికపై లైంగిక దాడి చేసి, ఆపై బలవంతంగా తాళి కట్టాడన్న ఫిర్యాదుతో ఓ యువకుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్టు పాల్వంచ సీఐ రాఘవేంద్రరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన బాలికను, ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన కొనపాకుల నవీన్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు.
తాము పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతడి పద్ధతి మారలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 22న బాలికను బెదిరించి, మోటార్ సైకిల్పై కల్లూరు శివారుకు తీసుకెళ్లి లైంగికంగా దాడి చేసినట్టు తెలిపారు. ఆ బాలిక ఏడుస్తున్నా పట్టించుకోకుండా బలవంతంగా మెడలో తాళి కట్టాడని ఆమె బంధువులు తమ ఫిర్యాదులో తెలిపారు. వారి ఫిర్యాదుతో నిందితుడిపై నిర్భయ కేసు నమోదైంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద నిందితుడు నవీన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కిడ్నాప్కు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. సమావేశంలో ఎస్సై ఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.