డబ్బు కోసం చంపేస్తున్నారు
స్నేహితులనీ వదలడం లేదు
వివాహేతర సంబంధాలతోనూ దారుణాలు
పక్షం రోజుల్లోనే ఏడుగురి హత్య
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న నేర ప్రవృత్తి
ఉమ్మడి జిల్లాలో ఇటీవలి కాలంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. క్షణికావేశంలోనో.. పక్కా ప్రణాళికతోనో ఇతరుల ప్రాణాలను తీసేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానో.. ఆస్తులు, డబ్బుల కోసమో హత్యలకు ఒడిగడుతున్నారు. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో హత్యలు పెరిగాయి. పక్షం రోజుల్లోనే ఏడు హత్యలు జరగడం కలవరం సృష్టిస్తోంది.
కామారెడ్డి క్రైం: బంధాలు, బంధుత్వాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. స్నేహానికి కూడా విలువలేకుండా పోతోంది. డబ్బే ప్రధానమవుతుండడంతో దానికోసం దారుణాలకూ ఒడిగడుతున్నారు. డబ్బు, ఆస్తులు, వివాహేతర సంబంధాలతో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పక్షం రోజుల్లో ఆరు సంఘటనల్లో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఆయా కేసుల్లో నిందితులు అత్యంత కిరాతకంగా ఎదుటివారిని హత్యచేశారు.
వరుస ఘటనలు..
ఆస్తులు, డబ్బుల కోసం...
ఆయా హత్య కేసులను పరిశీలిస్తే ఆస్తి, డబ్బు హత్యలకు ప్రధాన కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్లోని కంఠేశ్వర్లో జరిగిన జంట హత్యల వెనుక కారణం ఇదే. రూ. 2 వేలు, 2 సెల్ఫోన్లను దొంగిలించేందుకు స్నేహితులుగా వచ్చిన ఇద్దరు ఈ దారుణానికి తెగబడ్డారు. నాందేవ్వాడలో తమ్ముడిని అన్న హత్య చేయడానికి కూడా డబ్బే కారణం.. బస్వాపూర్ సమీపంలో జరిగిన తుడుం రాకేష్ హత్య ఉదాంతం వెనుక కూడా ఇలాంటి కారణాలే ఉన్నాయి. మద్నూర్ మండలం ఇలేగావ్లో మృతుడు గుండాజీపై జరిగిన దాడికి ఒక గుంట ఆస్తి మాత్రమే కారణం కావడం గమనార్హం.
వివాహేతర సంబంధాలూ..
వివాహేతర సంబంధాలు కూడా హత్యలకు దారితీస్తున్నాయి. కొల్లూర్ గ్రామంలో జరిగిన నానుగొండ హత్య ఈ కారణంతోనే జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతోనే అతడి స్నేహితుడు నానుగొండను గొడ్డలితో నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు నెలల క్రితం భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో నివాసం ఉండే బ్యాంకు ఉద్యోగిని అరుణ హత్య కూడా వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగింది. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆమెను ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేశాడు.
పెరుగుతున్న నేర ప్రవృత్తి...
నేరాలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో వాటి ఫలితాలు ఆశించినంతగా కనిపించడం లేదు. పోలీసుశాఖ లెక్కల ప్రకారం నేరాల తగ్గుదలలో కొద్దిపాటి వ్యత్యాసం మాత్రమే ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2016లో 30, 2017లో 23, 2018లో 21 హత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే 10 మందికిపైగా హత్యకు గురయ్యారు. కారణాలు ఏవైనా జిల్లాలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. నేరాల నియంత్రణపై పోలీసుశాఖ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.