చింతమనేనికి చుక్కెదురు

7 Mar, 2018 19:31 IST|Sakshi
చింతమనేని ప్రభాకర్‌

సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరులోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దు లేదా తొలగి౦చాలనే అభ్యర్థనను అ౦గీకరి౦చబోమని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టేందుకు చింతమనేని సిద్ధమవుతున్నారు.

2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు