తనుశ్రీపై కేసు నమోదు

5 Oct, 2018 12:34 IST|Sakshi
తనుశ్రీ దత్తా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, ముంబై : నానా పటేకర్‌, వివేక్‌ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్‌ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్‌ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) కార్యకర్త సుమంత్‌ దాస్‌ ఫిర్యాదుతో బీడ్‌ జిల్లాలోని కైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఎంఎన్‌ఎస్‌ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రాజ్‌థాకరే, ఎంఎన్‌ఎస్‌ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్‌లో వద్దు..
ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో-12వ  సీజన్‌లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్‌ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్‌ఎస్‌ యూత్‌వింగ్‌ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్‌ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్‌ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు.

మరిన్ని వార్తలు