ప్రియుడితో కలసి మామను...

20 Jan, 2019 11:57 IST|Sakshi
విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి

మామను హత్య చేయించిన కోడలు 

ఐదుగురికి రిమాండ్‌ 

19రోజుల్లోనే కేసును చేధించిన సీఐ సురేందర్‌ రెడ్డి 

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ కోడలు తన ప్రియుడిని ఉసిగొల్పి తన మామను హత్య చేయించింది. సదాశివపేట సీఐ కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్‌ 30న సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట్‌ గ్రామానికి చెందిన బుడ్డోల రాములు(60)తన ఇంటికి ప్లాస్టింగ్‌ చేయించడానికి మేస్త్రీ కొరకు వెళ్లి మూడు రోజుల తర్వాత సదాశివపేట మండలంలోని బొబ్బిలిగామ శివారులో శవమై కనిపించాడు.

దీంతో ఈనెల 1న అతడి భార్య దేవమ్మ తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పోలీసుల పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయీ. మృతుడి పెద్దకొడుకు భాగయ్య సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి బొబ్బిలిగామ గ్రామానికి చెందిన పెద్దగొల్ల మల్లేశం దగ్గర ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తుండడంతో అప్పుడప్పుడూ పెద్దగొల్ల మల్లేశం మల్లారెడ్డిపేట్‌ గ్రామానికి వస్తూ వెళ్తుండేవాడు ఈ క్రమంలో భాగయ్య భార్య నవీనతో మల్లేశంకు పరిచయం ఏర్పడి అది అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం తెలిసిన మృతుడు రాములు, అతని భార్య దేవమ్మ పెద్దగొల్ల మల్లేశంను, కోడలు నవీనను పలుమార్లు వారించారు. దీంతో నవీన తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న మామను చంపాలి, లేదంటే నేనే నీ పేరుమీద చనిపోతా అని మల్లేశంను ఫోనులో బెదిరించగా.. మల్లేశం నవీన మామ రాములును ఎలాగైనా చంపాలని పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా గతేడాది డిసెంబర్‌ 30న తన మామ మేస్త్రీ కొరకు మల్లారెడ్డిపేటలో తిరుగుతున్నాడని మల్లేశంకు చెప్పగా.. మేస్త్రీ గురించి తమ గ్రామానికి పోదామని తన మోటార్‌ సైకిల్‌పై బొబ్బిలిగామ గ్రామానికి తీసుకెళ్లాడు.

అనంతరం మేస్త్రీ లేకపోవడంతో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి కల్లు తాగారు. రాములు మత్తులోకి వెళ్లగా  తనకు సాయం చేయాలని మొగులయ్య, చాంద్‌పాషా, దశరథ్‌గౌడ్, అంజయ్యలను కోరగా వారు నిరాకరించారు. దీంతో అదేరోజు రాత్రి ఇంటికి వెళ్దామని చెప్పి మోటార్‌ సైకిల్‌ పై తీసుకెళ్లి బొబ్బిలిగామ నుంచి మల్లారెడ్డిపేట్‌ వెళ్లే రోడ్డుకు ఎడమ వైపు తీసుకెళ్లి ఇనుప కర్రతో రాములు తలపై, ఇతర శరీర భాగాలపై కోట్టి రుమాల్‌తో గొంతుకు బిగించి చంపివేసినట్లు నిందితుడు తెలిపాడని సీఐ పేర్కొన్నారు. చాంద్‌ పాషా మాత్రం పరారీలో ఉన్నాడు.

సిబ్బందికి అభినందనలు.. 
ఈ కేసులో మొదటినుంచి కష్టపడి కేసు చేధించడానికి పూర్తిగా సహకరించిన సిబ్బంది ఏఎస్‌ఐ కిష్టయ్య, సిబ్బంది జగన్, వెంకటేశం, శ్రీనివాస్, రమేష్, వీరేశంలను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు