భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధింపులు

13 Jan, 2020 07:37 IST|Sakshi

ఎన్‌ఆర్‌ఐ భర్తపై కేసు నమోదు

జవహర్‌నగర్‌: భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐ భర్తపై జవహర్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కౌకూర్‌లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయిమాధవికి 2013లో  ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానంకు చెందిన శేరు వినయ్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత వినయ్‌    ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో టూరిస్ట్‌ వీసాపై ప్రాన్స్‌ వెళ్లిన సాయిమాధవి కొద్దిరోజుల  పాటు అక్కడే ఉంది.

ఈ నేపథ్యంలో ఆమె భర్త వినయ్, అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2014 జులైలో కౌకూర్‌లోని సోదరుడి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా భర్త వినయ్‌ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఆదివారం జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు