పోరాడి పట్టించారు

28 Nov, 2017 09:03 IST|Sakshi

చైన్‌ స్నాచర్‌ను ఎదురించిన వృద్ధులు

దొంగపై పిడిగుద్దులు బైక్, తుపాకీ వదిలేసి పరారైన దొంగ

పోలీసుల అదుపులో నిందితుడు

‘గుడ్‌ సీనియర్‌ సిటిజన్‌’ రివార్డుతో సన్మానించిన సీపీ

సాక్షి,సిటీబ్యూరో: బైక్‌పై వెళుతుండగా బంగారు మంగళసూత్రం లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన చైన్‌ స్నాచర్‌ను నిలువరించడమేగాక అతడిపై  పిడిగుద్దులు కురిపించిన సీనియర్‌ సిటిజన్‌ దంపతులను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అభినందించారు. సోమవారం మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ,, కుషాయిగూడ ఏసీపీ కష్ణామూర్తితో కలిసి  వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన  మనోజ్‌ స్వైన్‌ చిన్నప్పటి నుంచే చోరీలకు అలవాటు పట్టాడు గతంలో జ్యువనైల్‌ హోంకు వెళ్లి వచ్చాడు. ఉద్యోగం కోసం నగరంలోని చర్లపల్లికి వచ్చి క్యాటరింగ్‌ బాయ్‌గా పనిచేస్తున్న అతడికి అదే ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిల్, హకీంలతో పరిచయం ఏర్పడింది.

విలాసవంతమైన జీవనం గడిపేందుకు స్నాచింగ్‌లు, చోరీలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి దేశవాళీ తుపాకీ, తూటాలు, కత్తిని కొనుగోలు చేశారు. గత జూన్‌లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ నుంచి ఓ బైక్‌ను దొంగతనం చేసి దానిపై తిరుగుతూ కుషాయిగూడలో రెండు, కీసరలో నాలుగు, లాలాగూడలో ఒక చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. చిరునామాలు అడుగుతూ మహిళ మెడల్లోంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవారు.  అనిల్, హకీం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో ఈనెల 17న మనోజ్‌ కొండాపూర్‌ నుంచి యామ్నాపేటకు బైక్‌పై వెళుతున్న వృద్ధ దంపతులు దర్శన్, బాలంగిణిలను గుర్తించాడు.

కరీమాగూడ సమీపంలో వారి స్కూటర్‌ను ఢీకొట్టాడు. కిందపడిపోయి న దర్శన్‌ మెడపై తుపాకీ కవర్‌తో దాడి చేసి, బాలంగిణి మెడ లోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో తేరుకున్న దర్శన్‌ దొంగపై రాళ్లతో దాడి చేయడంతో అతను బైక్, చెప్పులు అక్కడే వదిలి పొలాల్లోకి పారిపోయాడు. కీసర పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి చర్లపల్లిలోని బీఎం రెడ్డి కాలనీలో ఉంటున్న మనోజ్‌ను ఆదివారం అదుపులోకి తీసు కుని 6.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మల్లాపూ ర్‌లోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో తనఖా పెట్టిన మూడు తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మనోజ్‌ పదునైన కత్తితో దాడిచేయడంతో పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసుకు స్వల్పగాయాలయ్యాయి. దొంగను నిలువరించిన వృద్ధ దంపతులను గుడ్‌ సిటిజన్‌ రివార్డుతో, దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు ప్రోత్సహకాలు అందజేశారు. 

మరిన్ని వార్తలు