పాత కరెన్సీ మార్పిడి ముఠా గుట్టురట్టు

10 Jan, 2018 20:00 IST|Sakshi

రూ.74.71 లక్షల నగదు స్వాధీనం

సాక్షి, ఉప్పల్(హైదరాబాద్‌): ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పాత కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఇందులో కీలకపాత్ర పోషించిన ఇద్దరితోపాటు ఒక జువైనల్‌ను అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్ పీఎస్‌లో మల్కాజిగిరి ఏసీపీ సందీప్ రావు బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన మహమ్మద్ హఫీజ్  హైదరాబాద్ వచ్చి ముర్గీచౌక్‌లో గాజులు తయారు చేస్తున్నాడు. తలాబ్ కట్టకు చెందిన ఆదిల్, ఘాజీ బజార్‌కు చెందిన బాబుభాయ్, మరొక మైనర్‌తో కలిసి లక్షకు ఇరవై శాతం కమీషన్‌తో పాత కరెన్సీ మార్పిడి చేస్తామని నమ్మబలికి సన్నిహితులు, మిత్రులు, బంధువుల నుంచి దాదాపు రూ.75 లక్షలకు పాత కరెన్సీని సేకరించారు.

ప్రధాన నిందితుడు హఫీజ్ బుధవారం ఉప్పల్ ప్రశాంత్నగర్‌లో తన దగ్గర ఉన్న రూ.74 లక్షల 71 వేలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి రెండు మోటర్ సైకిళ్లపై దాచిపెట్టి మధ్యవర్తుల కోసం ఆదిల్‌తో కలిసి ఎదురు చూస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.74.71 లక్షల విలువ జేసే పాత కరెన్సీ, రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడు బాబూభాయ్ పరారీలో ఉండగా మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకుని అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు