చితిని పేర్చుకుని వృద్ధుడు ఆత్మాహుతి

24 Oct, 2019 07:25 IST|Sakshi

దొడ్డ తాలూకాలో విషాద ఘటన  

కర్ణాటక,దొడ్డబళ్లాపురం: కుమారుడు మరణించడం, బంధువులు దూరం కావడంతో జీవితం మీద విరక్తి చెందిన వృద్ధుడు చితిని పేర్చుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న సంఘటన బెంగళూరు సమీపంలో దొడ్డబళ్లాపుర తాలూకా తిప్పూరు గ్రామం శివారులో చోటుచేసుకుంది. తిప్పూరు నివాసి అజ్జప్ప(85)ఆత్మహత్యకు పాల్పడ్డ వృద్ధుడు. తిప్పూరు గ్రామం శివారులోని గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో కట్టెలు పేర్చుకుని చితి ఏర్పాటుచేసుకుని చితిపై పడుకుని నిప్పంటించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏం జరిగింది  
అజ్జప్ప కుమారుడు సిద్ధప్ప(58)గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందాడు. ఆనాటి నుండి మానసికంగా కృంగిపోయిన అజ్జప్ప ఇల్లు, ఊరు వదిలి దేవాలయాల్లో,పాడుబడ్డ మండపాల్లో నివసిస్తూ ఉండేవాడు. కోడలు, మనవళ్లతో కుమారుడు బ్రతికున్నప్పుడే గొడవలు వచ్చి మాట్లాడ్డం లేదు. గత నాలుగు రోజులుగా అజ్జప్ప ఎక్కడా కనిపించలేదు.ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతానికి వెళ్లిన గొర్రెలకాపర్లకు బుధవారంనాడు చితిపై సగం కాలిన శవం కనిపించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో శవం అజ్జప్పదే అని,తానే చితిపేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. నాలుగు రోజుల కిందటే ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దొడ్డబెళవంగల పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు