బాలికపై వృద్ధుడి లైంగికదాడి

3 May, 2018 07:27 IST|Sakshi

దాచేపల్లిలో ఘటన

పరారీలో నిందితుడు

దాచేపల్లి : బాలికపై వృద్ధుడు లైంగిక దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో బుధవారం కలకలం రేపింది. 55 ఏళ్ల వృద్ధుడు చాక్లెట్లు కొని ఇస్తానని నమ్మబలికి ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం స్థానిక జలగలబజారుకు చెందిన 9 ఏళ్ల బాలిక రెండో తరగతి చదువుకుంటుంది. వేసవి సెలవులు కావటంతో బాలిక ఇంటి వద్దనే ఉంటోంది. ఇంటి సమీపంలో నివసిస్తున్న అన్నం సుబ్బయ్య రిక్షా బండి నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నా, ప్రస్తుతం వారిద్దరు సుబ్బయ్యకు దూరంగా ఉంటున్నారు.

పరారీలో నిందితుడు
ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాక్లెట్లు కొనిస్తానని బాలికకు చెప్పి, రిక్షా ఎక్కించుకుని, ఇంటికి కొంతదూరంలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడి చేశాడు. తల్లిదండ్రులకు చెప్పితే చంపేస్తానని బాలికను సుబ్బయ్య బెదిరించాడు. అనంతరం బాలికను రిక్షాపై తీసుకువచ్చి ఇంటి సమీపంలో వదిలిపెట్టాడు. మధ్యాహ్నం 4గంటల సమయంలో కడుపులో నొప్పి వస్తుందని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. బట్టలపై రక్తం మరకలు ఉండటాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని బాలికను ప్రశ్నించింది. జరిగిన ఘటనను తల్లికి చెప్పింది. బాలిక నీరసించి సొమ్మసిల్లి పడిపొయింది. దీంతో తల్లిదండ్రులు బాలికను నారాయణపురంలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకువచ్చారు.

అప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు బాలికకు చికిత్స చేసి వైద్యం అందించారు. విషయం బయటకు పొక్కటంతో సుబ్బయ్య పరారైయ్యాడు. బాలిక బంధువులు భారీగా హాస్పిటల్‌ వద్దకు చేరుకున్నారు. గురజాల రూరల్‌ సీఐ నరసింహరావు, ఎస్సై అద్దంకి వెంకటేశ్వర్లు బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. మెరుగైన వైద్యం కోసం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలికపై ఆత్యాచారం ఘటనతో దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు, గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు