సాక్షి, ఆరిలోవ(విశాఖ తూర్పు) : ఐదేళ్ల బాలికపై అరవయ్యేళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన ఘటన ఆరిలోవ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ వృద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కదిరి గ్రామానికి చెందిన తుమ్మగుంట అప్పలనాయుడు(60) సాగర్నగర్ సమీపంలోని భువనేశ్వరి కాలనీలో అతని కుమారుడి వద్ద రెండేళ్లుగా ఉంటున్నాడు. ఇద్దరూ తాపీ పనికి వెళ్తుంటారు. కాలు నొప్పిగా ఉండడంతో గురువారం అప్పలనాయుడు పనికి వెళ్లలేదు. ఇంట్లో మధ్యాహ్నం మద్యం సేవించాడు. అదే ప్రాంతానికి చెందిన వృద్ధురాలు తన ఐదేళ్ల మనవరాలిని ఎత్తుకొని కాలనీలో ఉన్న వినాయక పందిరి వద్దకు వచ్చింది. ఏదో పని మీద పక్కకు వెళ్లాలని తన మనవరాలిని అక్కడే ఉన్న అప్పలనాయుడుకి అప్పగించింది.
ఆమె తిరిగి వచ్చేసరికి ఆ బాలికను అక్కడికి సమీపంలో ఉన్న చిన్న గుడి వెనుకకు తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. కొందరు స్థానికులు గమనించి అడ్డుకున్నారు. అతనిని పట్టుకొని దేహశుద్ధి చేసి, ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కిశోర్కుమార్, సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా ఏసీపీ మూర్తి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బాలిక నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.