వృద్ధుడి అనుమానాస్పద మృతి  

4 Jul, 2018 13:37 IST|Sakshi
 పోచయ్య మృతదేహం 

హత్య చేశారని బంధువుల ఆరోపణ

దేవునిపల్లిలో ఘటన

కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే, అతడిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సోమవారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన దేవునిపల్లితో పాటు కామారెడ్డిలో చర్చనీయాంశమైంది.

దేవునిపల్లికి చెందిన కుంచం పోచయ్య (60) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో కామారెడ్డి రూరల్‌ సీఐ భిక్షపతి, దేవునిపల్లి ఎస్సై సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడారు.

స్థానికంగా ఉండే ఓ ప్రజాప్రతినిధి తమ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో కొంతకాలంగా సమస్యలు తలెత్తాయని మృతుని భార్య లక్ష్మి ఆరోపించింది. తమ కోడలు కౌసల్యతో కలిసి ఓ ప్రజాప్రతినిధి, మరో వ్యక్తి తన భర్తను హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో భూమి విక్రయించగా తన భర్తకు రావాల్సిన డబ్బును తమ కోడలికే సదరు ప్రజాప్రతినిధి ఇప్పించాడని ఫిర్యాదులో పేర్కొంది.

మరోవైపు, శనివారం రాత్రి హత్య చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొనడం అనుమానాలకు దారితీస్తోంది. మృతుడు సోమవారం రాత్రే చనిపోయి ఉంటాడని చుట్టు పక్కల వారు, పోలీసులు విశ్వసిస్తున్నారు. ఈ విషయమై కామారెడ్డి రూరల్‌ సీఐ భిక్షపతిని సంప్రదించగా, మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆత్మహత్యానా లేక హత్య అనే విషయం పోస్టుమార్టం నివేదిక ద్వారా, తమ విచారణ అనంతరం తెలుస్తుందన్నారు.
 

మరిన్ని వార్తలు