పరీక్షలో ఒకరి స్థానంలో మరొకరు  

3 May, 2018 11:36 IST|Sakshi
రాహుల్, మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్‌

బీటెక్‌ ఎగ్జామ్స్‌లో నలుగురు  విద్యార్థుల అరెస్ట్‌

రిమాండుకు తరలించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు

పెద్దఅంబర్‌పేట : వేర్వేరు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో జరుగుతున్న బీటెక్‌ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాస్తూ మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథ«నం ప్రకారం బీహార్‌ రాష్ట్రానికి చెందిన అరుణ్‌కుమార్, ఒడిషాకు చెందిన దుర్గాచరణ్‌ మిశ్రా దేశ్‌ముఖ్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివారు.

అయితే, అరుణ్‌కుమార్‌కు కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో తాజాగా జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు అవంతి ఇంజనీరింగ్‌ కశాశాలలో రాస్తున్నాడు. మంగళవారం జరిగిన పరీక్షకు అరుణ్‌కుమార్‌ స్థానంలో అతని స్నేహితుడు దుర్గాచరణ్‌మిశ్రా హాజరయ్యాడు.  గమనించిన ఇన్విజిలేర్‌ అతన్ని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు.  

మరో ఘటనలో ఇద్దరు... 

బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాహుల్, మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్‌ సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. అయితే మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్‌ తృతీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు తప్పాడు.

అయితే, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన మహ్మద్‌పాషాబాజ్‌ఖాన్‌ స్థానంలో రాహుల్‌ వచ్చాడు. అతడిని పట్టుకున్న ఇన్విజిలేటర్లు పోలీసులకు అప్పగించారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు.   

మరిన్ని వార్తలు