బంతుల కోసం వెళ్లి బలయ్యాడు

10 Feb, 2020 03:38 IST|Sakshi

విద్యుదాఘాతంతో బాలుడి దుర్మరణం

బంజారాహిల్స్‌: క్రికెట్‌ ఆడాలని బంతులు తెచ్చుకునేందుకు టెన్నిస్‌ బాల్‌కోర్టులోకి దూకిన ఓ బాలు డు వాటిని తీసుకుని గోడదూకి వచ్చే క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివాసం ఉండే యాదమ్మ, శేఖర్‌ల కుమారుడు మంజరి అఖిల్‌ (12)  6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం బడి లేకపోవడంతో తోటి స్నేహితులతో కలిసి ఉదయం క్రికెట్‌ ఆడుతుండగా బంతి పోగొట్టుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న ఎఫ్‌ఎన్‌సీసీ టెన్నిస్‌ కోర్టులో వృథాగా పడి ఉన్న టెన్నిస్‌ బంతులను తెచ్చుకుందామని గోడదూకి వెళ్లాడు. మాగంటి కాలనీని ఆనుకొని ఉన్న ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ టెన్నిస్‌ కోర్టులో నిత్యం టెన్నిస్‌ ఆడుతుం టారు. ఆట పూర్తయిన తర్వాత ఆ బంతులను బుట్టలో వేస్తుంటారు. అది తెలిసిన అఖిల్‌ ఎమ్మార్సీ కాలనీ వైపునున్న ఎత్తైన గోడను ఎక్కి ట్రాన్స్‌ఫార్మర్‌ పక్క నుంచి లోపలికి వెళ్లి బంతులను తెచ్చే క్రమంలో గోడ దూకడానికి యత్నించాడు. పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే కుప్పకూలిపోయాడు.  బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు