లక్కీ డ్రా పేరుతో టోకరా

9 Feb, 2018 11:58 IST|Sakshi
బూట్లను చూపుతున్న బాధితుడు

రూ.4500 చెల్లిస్తే రూ.500 షూ పంపిన వైనం  

కర్నూలు, సి.బెళగల్‌: లక్కీ డ్రా పేరుతో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు మోసగించారు. బాధితుడి వివరాల మేరకు.. కంబదహాల్‌ గ్రామానికి చెందిన ఉప్పర రాముడు కుమారుడు ఉప్పర గోవిందు సెల్‌ఫోన్‌కు గత వారం గుర్తుతెలియని వ్యక్తులు 9711153027 నంబర్‌ నుంచి ఫోన్‌ చేశారు. మీ సెల్‌ నంబర్‌కు లక్కీ డ్రాలో రూ.15 వేల విలువ చేసే సెల్‌ఫోన్, బూట్లు తగిలాయని రూ.4500 చెల్లిస్తే చాలని నమ్మించారు. దీంతో సదరు యువకుడు ఆర్డర్‌ చేశాడు. గురువారం పోస్టల్‌ ద్వారా పార్శిల్‌ రాగా రూ.4500 చెల్లించి తీసుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.500 విలువచేసే బూట్లు మాత్రమే కనిపించాయి. బాధితుడు తాను ఆర్డర్‌ చేసిన సెల్‌నంబర్‌కు ఫోన్‌ చేయగా తాము ఇచ్చేది ఇంతేనని, ఎవరికి చెప్పకుంటావో చెప్పుకో పో అంటూ గుర్తు తెలియని వ్యక్తి దబాయించాడు. చివరకు బాధితుడు తనకు జరిగిన మోసంపై ఎస్‌ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు