బర్మార్(రాజస్థాన్) : మనిషి ప్రాణం కన్నా సెల్ఫీలు తీసుకోవడమే ముఖ్యమన్నట్లు ప్రవర్తించి.. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి బాటసారులు పరోక్ష కారణమయ్యారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... గుజరాత్కు చెందిన పర్మానంద్, చంద్రారామ్, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు లేబర్ కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారు.
తమ ప్రాంతంలో పని చేసేందుకు కార్మికులు అవసరం ఉండటంతో రాజస్థాన్లోని బర్మార్కు వచ్చారు. బైక్పై ప్రయాణిస్తున్న వీరిని స్కూలు బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లి తమను కాపాడాల్సిందిగా రోడ్డుపై వెళ్తున్న వారిని వేడుకున్నారు. అయితే రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతున్న బాధితులతో సెల్ఫీలు దిగుతూ, వీడియోలు షూట్ చేస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సాటి మనుషుల ప్రాణాలు కాపాడకుండా ఫొటోలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.