కాంగ్రెస్‌ నాయకుడిపై దాడి!

13 Feb, 2020 09:06 IST|Sakshi
హైదరాబాద్‌లో జలందర్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సాక్షి, చిట్యాల(నల్గొండ): పీఏసీఎస్‌ డైరెక్టర్‌ అభ్యర్థిపై దాడి జరిగిన ఘటన మంగళవారం రాత్రి చిట్యాలలో జరిగింది. చిట్యాల ఎస్‌ఐ ఎ.రాములు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పీఏసీఏస్‌ మూడో వార్డు నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో డైరెక్టర్‌గా పోటీ చేస్తున్న గోధుమగడ్డ జలందర్‌రెడ్డి  చిట్యాల కాంగ్రెస్‌ నాయకుడు చెందిన వెల్పూరి నాగిరెడ్డి తండ్రి బీంరెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఐదో రోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లారు. అనంతరం భోజనం చేసిన తర్వాత రాత్రి 11గంటల సమయంలో తన ఇంటికి బైక్‌పై మరో యువకుడితో కలిసి బయలు దేరారు. స్థానిక కెనారా బ్యాంకు సమీపంలోకి రాగానే సర్వీస్‌ రోడ్డులో దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరో వ్యక్తి బైక్‌పై వచ్చి జలందర్‌రెడ్డి ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టారు.

కింద పడడంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన జలందర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జడల ఆదిమల్లయ్య అనుచరుడైన దయ్యాల శ్రీకాంత్‌తోపాటు మరికొందరు కలిసి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పరామర్శ
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నాయకుడు గొధుమగడ్డ జలందర్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బాధితుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ నాయకుడు కంచర్ల వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు